17 March, 2026 | 11:17 PM

నేషనల్ టార్గెట్ బాల్ పోటీకి ఎంపికైన పేదింటి ఆణిముత్యం

17-03-2026 09:41 PM

పేద కుటుంబం నుంచి జాతీయస్థాయికి

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రతిభకు పేదరికం అడ్డు కాదని మరోసారి నిరూపితమైంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని వైఎస్ఆర్ నగర్‌కు చెందిన శారీరక విద్య ఉపాధ్యాయుడు రాంపల్లి మధు జాతీయ స్థాయిలో మరో గొప్ప విజయాన్ని సాధించాడు. తను కష్టపడి సాధించిన ప్రతిభతో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికై సీనియర్ నేషనల్ టార్గెట్ బాల్ పోటీల్లో పాల్గొనబోతున్నాడు.

పేద కుటుంబం నుంచి వచ్చిన మధు తన కృషి, పట్టుదలతో క్రీడారంగంలో ముందుకు సాగుతూ అనేక విజయాలు సాధించడం జవహర్ నగర్ వాసులకే కాక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకే గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు. ఆటల్లో ఆణిముత్యమై క్రీడల్లో చిచ్చర పిడుగులా మెరుస్తున్న క్రీడాకారుని ప్రతిభకు జవహర్ నగర్ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. 2026వ సంవత్సరంలో రెండోసారి సీనియర్ నేషనల్స్‌కు ఎంపిక కావడం విశేషం. గత జనవరిలో మధ్యప్రదేశ్‌లో జరిగిన డ్యూ బాల్ సీనియర్ నేషనల్ పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించిన మధు, ఇప్పుడు టార్గెట్ బాల్ సీనియర్ నేషనల్ పోటీలకు ఎంపికయ్యాడు.

ఏప్రిల్ 3 నుంచి 7 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రపూర్‌లో జరగనున్న ఈ జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టులో మధు తన ప్రతిభను ప్రదర్శించనున్నారు. మధు సాధించిన ఈ విజయంపై స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు  స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన కష్టపడి సాధించిన ఈ అవకాశంతో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ముఖ్యంగా జవహర్ నగర్ క్రీడాభిమానులు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.