06-06-2025 11:48:09 PM
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ,(విజయక్రాంతి): వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేలేరు, ధర్మసాగర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం వేలేరు, ధర్మసాగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పిసిసి పరిశీలకులు వినయ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 22వేల 500కోట్లతో 4లక్షల 50వెల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు.
అందులో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.175 కోట్లతో 3వేల 500ఇల్లు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నాలుగు విడతలలో నేరుగా లబ్ధిదారు ఖాతాలలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా, అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. అధికారులు గ్రామాలలో లబ్ధిదారులను, గ్రామస్తులను వెంట పెట్టుకొని ఒకటికి రెండుసార్లు సర్వే చేసి ఎంపిక చేశారాని అన్నారు. అర్హులైన వారికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్న బియ్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. క్వింటాకు 500 బోనస్, రైతు భరోసా, మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా కొనసాగిస్తుందని తెలియజేశారు. పార్టీ పరిశీలకుల నిర్ణయం మేరకే పదవులు ఉంటాయని, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికీ అవకాశాలు వస్తాయని అన్నారు.