12-10-2025 03:47:04 PM
పసుమామల బస్తీ దవాఖాన వైద్యాధికారి శృతి
అంగన్వాడి కేంద్రంలో పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం
అబ్దుల్లాపూర్ మెట్: చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని పసుమాముల బస్తీ దావఖాన వైద్యాధికారి శృతి అన్నారు. రాష్ట్రంలోకి పోలియో తిరిగి రాకుండా చూసేందుకు అక్టోబర్ 12న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు ఆరు జిల్లాల్లో ప్రత్యేక పల్స్ పోలియో టీకా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ పసుమాముల అంగన్వాడి కేంద్రంలో పోలియో చుక్కల పంపిణీని ఆదివారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి శృతి మాట్లాడుతూ... పిల్లల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తే భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా ఉంటుందన్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే వారికి పోలియో వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ నాడీ వ్యవస్థ పై దాడి చేస్తుందని, దీనివల్ల శాశ్వత పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కోసారి ఈ వైరస్ శ్వాసకోశ కండరాలపై ప్రభావం చూపి ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చని సూచించారు. పోలియో టీకా పిల్లలకు ఒక రక్షణ కవచం లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కొరివి పద్మ, స్టాప్ నర్స్ సంధ్యారాణి, అంగన్వాడి టీచర్ డి రాణి, ఆశా వర్కర్ డి సబిత, సహాయకులు భార్గవి, గంగ తదితరులు ఉన్నారు.