calender_icon.png 7 June, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి రెవెన్యూ సదస్సులు.. భూసమస్యల పరిష్కారం కోసమే

05-06-2025 06:49:07 PM

ఇందిరమ్మ పట్టాల పంపిణీ..

ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా..

ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి..

రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విజిట్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): భూసమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులని తలపెట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులతో భూసమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సును మండల తహశిల్దార్ కృష్ణ, సిఐలతో కలిసి సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

ఈ దరఖాస్తులను రికార్డులతో సరి చూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం తొలుతగా రాష్ట్రంలోని 4 జిల్లాలో 4 మండలాలను పైలెట్ మండలాలుగా ఎంపిక చేయడంలో భాగంగా జిల్లాలోని భీమారం మండలాన్ని ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యల సంబంధిత దరఖాస్తులు స్వీకరించి దాదాపు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలోని భీమారం మినహా అన్ని మండలాలలో కార్యచరణ ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు.

నూతన చట్టంలో రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం, సంబంధిత వారసులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుతో పాటు రిజిస్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిచినట్లయితే త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.

మండలంలోని పెర్కపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి హాజరై దరఖాస్తు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్.మహేందర్ ల తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్దిదారులు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలోని లబ్దిదారుడికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇంటిని పొందిన లబ్దిదారులు ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.