19-12-2025 08:43:36 PM
ఈ నెల 23 న సెంట్రల్ ప్రభారీ అధికారి నర్వ సందర్శన
అన్ని ఏర్పాట్లు చేయాలని ఇన్ ఛార్జీ కలెక్టర్ ఆదేశం
నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలోని నర్వ యాస్పరేషన్ బ్లాక్ ప్రాజెక్ట్ ప్రగతిపై శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ సంచిత్ గంగ్వర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నర్వ బ్లాక్లో ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు సామాజిక అభివృద్ధి రంగాలలో కీలకమైన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ (ABP) సూచికల ప్రకారం వంద శాతం సంతృప్తిని సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
ఈ నెల 22, 23 న సెంట్రల్ ప్రభారీ అధికారి స్వప్నాదేవి రెడ్డి నర్వ యాస్పిరేషన్ బ్లాక్ ను సందర్శిస్తారని తెలిపారు. 22 న నారాయణపేట కు చేరుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, 23 న నర్వ యాస్పరేషన్ బ్లాక్ పరిధిలోని గ్రామాలను సందర్శిస్తారన్నారు. అయితే 2023 మార్చి నుంచి 2025 సెప్టెంబర్ వరకు నర్వ మండలంలో నీతి అయోగ్ సూచించిన ఆయా సూచికల ప్రకారం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి కి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను ఆయా శాఖల అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని, సెంట్రల్ ప్రభారీ అధికారి ఏ పారామీటర్ గురించి అడిగినా.. సరైన సమాధానం, సమాచారం ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సందర్శన సందర్భంగా పాఠశాలలు, ప్రాథమిక, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. యాస్పరేషన్ బ్లాక్ కింద నర్వ ఎంపికైన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మంజూరైన నిధులు, చేసిన అభివృద్ధి పనుల వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఆయా విభాగాల వారీగా నివేదికలు తయారు చేసి శనివారం కార్యాలయంలో సమర్పించాలని, ఈ నెల 22 న సెంట్రల్ ప్రభారీ అధికారితో జరిగే సమీక్షకు, 23న జరిగే సందర్శనకు సంబంధిత అధికారులు సంసిద్ధంగా ఉండాలని ఇన్ ఛార్జీ కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, పశుసంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, నోడల్ అధికారి హిర్యా నాయక్, నర్వ తహాసిల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, నర్వ యాస్పరేషన్ బ్లాక్ సమన్వయ కర్త బాలాజీ, డిపిఓ బిక్షపతి, సిడిపివో లు, ఏవో, వైద్య శాఖ అధికారి, తదితరులు పాల్గొన్నారు.