21-06-2025 12:12:58 AM
* కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి
కల్వకుర్తి జూన్ 20 : రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం డబ్బులు జమజేస్తే బ్యాంకర్లు మాత్రం పాత బకాయిల కింద అకౌంట్స్ ను హోల్ లో పెట్టడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం పట్టణం లోని ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రం అందించిన అనంతరం కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితీ విజయ్ కుమార్ రెడ్డి, కల్వకుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ సేద్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దన్న ఉద్దేశంతో పంటల పెట్టుబడిగా రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 12,000 రూపాయలు సంవత్సరానికి గాను నిర్ణయించి వారి అకౌంట్లలో నిధులు వేస్తే బ్యాంకర్లు పాత బకాయిల పేరిట రైతుల అకౌంట్లను హోల్ లో పెట్టడం సరికాదన్నారు.
ప్రస్తుత వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి డబ్బులు లేక వ్యవసాయం మానేసే పరిస్థితి కొందరికి ఉంటే మరి కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తెచ్చుకోని ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ఇలా అయితే వ్యవసాయం రంగం అభివృద్ధి ఎలా చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులను అప్పుల పాలు చెయ్యొద్దనే ఉద్దేశంతో రైతులకు నేరుగా అకౌంట్ల ద్వారా నిధులు ఇస్తూ ఉంటే బ్యాంకు అధికారులు సహకరించక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైన పాత బకాయిల పేరిట అకౌంట్లను హోల్ లో పెట్ట కుండ, పెట్టిన వాటిని హోల్ నుంచి తీసి సకాలంలో రైతులకు ఇవ్వాలని కోరారు. వారితో పాటు యువజన కాంగ్రెస్ కల్వకుర్తి మండల అధ్యక్షులు బీస బాల్ రాజు, మార్చాలా గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, జంగయ్య, పాండు,పవన్ తదితరులుఉన్నారు.