డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దు
- ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇచ్చాం..
- జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ కలిసిన ఎమ్మెల్యే శంకర్
- డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకూడదంటూ ఎమ్మెల్యే భేటి
షాద్ నగర్ మే 26 (విజయక్రాంతి): ఇండస్ట్రియల్ పార్కు కోసమని పేదలు భూములు ఇచ్చారు.. ఇక్కడ ఉపాధి దొరుకుతుందని భావించారు.. తీరా పర్యావరణంతో పాటు ప్రజల జీవితాలను నాశనం చేసే ఏకో టౌన్ మాకొద్దని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జిహెచ్ఎంసి కమిషనర్ తో అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం సిద్దాపూర్ గ్రామంలో ఎకో టౌన్ ను ఏర్పాటు చేయవద్దని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు.
మేము ఎకో టౌన్ ప్రతిపాదనకు పూర్తిగా వ్యతిరేకం, మా ప్రజలు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడితే ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరుకుతుందని భూములు ఇచ్చారు.. కానీ ఎకో టౌన్ లాంటి ప్రతిపాదన తెచ్చి మా ప్రాంతాలలో పర్యావరణ సమస్యలను కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా లేమని ఎమ్మెల్యే కమిషనర్ కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ.. ఎకో టోన్ ఏర్పాటు కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 4 చోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
ఏకో టౌన్ లో కేవలం చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ( వేస్ట్ టు ఎనర్జీ) అనేది మున్సిపల్ ఘన వ్యర్థాలను (మురికి చెత్త) ఇంధనంగా మార్చి విద్యుత్తును తయారు చేస్తారు. అలాగే రీసైక్లింగ్ ప్రక్రియ చేస్తారు అని తెలిపారు. సిద్దాపూర్ లో ఏకో టౌన్ ప్రతిపాదన వద్దని ఎమ్మెల్యే కోరుతున్నందున ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.






