కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి
సూర్యాపేట, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య జయంతినీ శుక్రవారం కలెక్టరేట్లో బీసీ వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు.
ఆయన ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మనకు స్ఫూర్తిదాయకమన్నారు. రాజకీయ, సామాజిక రంగాలలో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత కొమురయ్యది అన్నారు. రైతుల హక్కులు, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదన్నారు.
యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ సమాజంలో న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలన్నారు. తదుపరి బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమన్నారు. అనంతరం వివిధ సంఘాల నాయకులు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిటిడిఓ శంకర్ వివిధ సంఘాల నాయకులు జె.సత్యనారాయణ, డాక్టర్ రామ్మూర్తి, చిన్న శ్రీరాములు, వి.సత్యనారాయణ, హుస్సేన్, రాజయ్య, లింగయ్య, పి.గామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.




