18-07-2025 12:31:27 AM
కేటీఆర్, హరీశ్లకు మైనంపల్లి హనుమంతరావు హెచ్చరిక
మెదక్, జూలై 17(విజయక్రాంతి): నన్ను నిద్రలేపితే.. బావ, బావమర్దులకు చుక్కలు చూపించడం ఖాయం అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులను హెచ్చరించారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో చందనా బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మైనంపల్లిని రెచ్చగొట్టవద్దని, తమ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని తెలిపారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్నారు. బీఆర్ఎస్ని వీడి మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈనెల 19న భారీ ఎత్తున గాంధీభవన్లో చేరికలు ఉంటాయన్నారు.
ఎలాంటి కుట్రలు చేసినా కేటీఆర్, హరీశ్రావు కుటుంబానికి చుక్కలు చూపిస్తామని తెలిపారు. మీడియా ఛానళ్లపై దాడులు సహించేది లేదన్నారు. తమ కార్యకర్తలు కూడా టీ న్యూస్, నమస్తే తెలంగాణ కార్యాలయాలపై దాడులు చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే మెదక్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, నాయకులు కొండన్ సురేందర్గౌడ్, బొజ్జ పవన్, మధుసూదన్రావు, లింగం, లక్ష్మీనారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు.