ప్రభుత్వ సేవలో డీటీఓ కొండ కర్ణాకర్ సేవలు అభినందనీయం
పెద్దపల్లిలో డీటీఓకు వీడ్కోలు సభలో టీజీఓఎస్ జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్ పటేల్
పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ సేవలో నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించి కొండ కర్ణాకర్ సహ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని టీజీఓఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) తూము రవీందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులు (డీటీఓ), టీజీఓఎస్ ట్రెజరర్ కొండ కర్ణాకర్ పదవీ విరమణ పొందిన సందర్భంగా టీజీఓఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా వీడ్కోలు మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన తూము రవీందర్ మాట్లాడుతూ.. కొండ కర్ణాకర్ తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తూము రవీందర్ తో పాటు ఇతర అధికారులు కొండ కర్ణాకర్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఓ సాజిద్ అలీ, డీఏఓ రవీంద్రనాథ్, డాక్టర్ జి. సురేష్, డాక్టర్ టి. మల్లేష్లతో పాటు ఖజానా శాఖ అధికారులు, టీజీఓఎస్ నాయకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని డీటీఓ కొండ కర్ణాకర్కు వీడ్కోలు పలికారు.






