09-06-2025 12:54:21 AM
సంగారెడ్డి, జూన్ 8(విజయక్రాంతి):: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసుకోవాలని, ఇది జూన్ 13వ తేదీ లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
బడుల్లో ఏటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఈ ఏడాది ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ సమయంలో సర్దుబాటు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం కోల్పోతామని చెబుతున్నారు. తక్షణమే ఉత్తర్వులను రద్దు చేయాలని, కనీసం జూన్ 30 వరకు వచ్చిన ప్రవేశాల ఆధారంగా సర్దుబాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇవీ నిబంధనలు..
మొదటి ప్రాధాన్యం పంచాయతీ పరిధి, తర్వాత స్కూల్ కాంప్లెక్స్, ఆ తర్వాత మండలం, అనంతరం జిల్లా పరిధిలో సర్దుబాటు చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేయాలనే నిబంధనలున్నాయి.
పరస్పర బదిలీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశమివ్వొద్దు. ఈ ప్రక్రియలో గత యూడైస్ వివరాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు, 60లోపు ఇద్దరు, 90లోపు ముగ్గురు, 120లోపు నలుగురు, 150వరకు ఐదుగురు, 200లోపు విద్యార్థులుంటే ఆరుగురు ఉపాధ్యాయులుండాలని, 200 దాటిన తర్వాత ప్రతి 40మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రవేశాలు పెంచేందుకు కసరత్తు...
ఈ ఏడాది బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. తమ కృషితో ప్రవేశాలు చాలవరకు పెరుగుతాయని ఆశాభావంతో ఉన్నారు. పలు గ్రామాల్లో పిల్లలను ప్రైవేటు బడులకు పంపబోమని తీర్మానాలు సైతం చేయించారు.
ఉపాధ్యాయుల వాదన ఇలా..
విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం 60 మంది విద్యా ర్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోతారు. ఇది ఆచరణలో అసాధ్యమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒకటి నుంచి ఐదోతరగతి వరకు మొత్తం 18 సబ్జెక్టులను ఇద్దరు ఎలా బోధిస్తారని, విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుందని ఉపాధ్యాయవర్గాలు వాదిస్తున్నాయి. బోధనతో పాటు అనేక రిపోర్టులు, నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంటుందని, వాటికే ఒకరు సరిపోతున్నారని చెబుతున్నారు.
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పదోన్నతులు, బదిలీలు, నూతన డీఎస్సీతో పాటు 2008 అభ్యర్థులను తాత్కాలిక ప్రాతి పదికన తీసుకోవడంతో సర్దుబాటు ఆవశ్యకత అంతగా లేకపోవచ్చనే వాదన ఉంది.
సర్దుబాటు ప్రక్రియ వాయిదా వేయాలి...సుంకరి కృష్ణ, పీఆర్టీయూ మెదక్ జిల్లాఅధ్యక్షుడు
ప్రభుత్వం ఇచ్చిన సర్దుబాటు ఉత్తర్వులు జూన్ నెలాఖరు వరకు వాయిదా వేయాలి. వేసవి సెలవుల్లో జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాం. ఫలితంగా ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
జూన్ 18 వరకు బడిబాటలో నూతన ప్రవేశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నాం. జూన్ చివరి వరకు ఎన్రోల్మెంట్ ఆధారంగా చేసుకుని సర్దుబాటు ప్రక్రియ చేపడితే ఫలితం ఉంటుంది.
సర్దుబాటు చేస్తాం...
ప్రభుత్వం ఇచ్చిన సర్దుబాటు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఉపాధ్యాయ సంఘాల నుండి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం పూర్తవగానే విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేస్తాం. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈనెలాఖరు వరకు విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
వేంకటేశ్వర్లు, డీఈవో, సంగారెడ్డి