పంచాయతీ ఎన్నికలపై ఈసీ ఫోకస్
- ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల
- సెప్టెంబర్ 21న తుది జాబితా
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. బుధవారం ఈ మేరకు ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితాను ప్రచురించి, ఇదే నెల 7 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నది. 9, 10వ తేదీల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నది. 21న వార్డుల వారీగా తుది జాబితాను ప్రచురించనున్నది. తుది ఓటర్ జాబితా తయారీపై ఈ నెల 29న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది.
కుల గణన డిమాండ్..
ఒకవైపు పంచాయతీ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తుండగా.. మరోవైపు బీసీ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కులగణన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం కూడా కుల గణన చేపట్టాకే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో ప్రకటించింది. ఇలాంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు కుల గణన చేయడం సాధ్యం కాదని, కుల గణనకు కనీసం రెండు లేదా మూడు నెలలు పడుతుందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక రాష్ట్రప్రభుత్వం ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.






