దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్
హైదరాబాద్: దేశంలో విద్యావిధానాన్ని(Education System) కేంద్రప్రభుత్వం(Central Government) వ్యాపారంగా మార్చిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ బోయినపల్లిలో జరిగిన ఛత్రోంకి గూంజ్(Chhatron Ki Goonj) కార్యక్రమానికి మహేశ్ గౌడ్ తో పాటు, కార్యక్రమ కన్వీనర్, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ... ఉద్యోగ, విద్యా పోటీ పరీక్షల పేపర్లను లీక్ చేస్తూ, విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటం అడ్డుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయడం లేదని, కేంద్రం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అందుకే ఈ ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమం రాహుల్ గాంధీ చేపట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.
విద్యార్థుల జీవితాలంటే కేంద్రానికి లెక్కలేదు: బల్మూర్ వెంకట్
విద్యార్థుల జీవితాలంటే కేంద్ర ప్రభుత్వానికి లెక్కలేదని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్- యూజీ లీకేజీతో లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలిని బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలకు జరగకుండా, పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో మార్పు కోసం లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఛత్రోంకి గూంజ్ కార్యక్రమంలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని సూచించారు.






