కృష్ణా బ్యాక్ వాటర్లో వాటర్ స్పోర్ట్స్
- జిల్లాలో టూరిజం అభివృద్ధికి రూ.5 కోట్లు
- పిల్లలమర్రి వద్ద చిల్డ్రన్ పార్కు ప్రారంభం
- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్నగర్, ఆగస్టు 21 (విజయక్రాంతి) మహబూబ్నగర్ జిల్లాలో 150 కిలోమీటర్లు ప్రవహిస్తున్న కృష్ణ్ణా నది బ్యాక్ వాటర్లో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు చేస్తామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పిల్లలమ ర్రి వృక్షం వద్ద చిల్డ్రన్ పార్కును ప్రారంభించారు. అనంతరం పిల్లలమర్రి వృక్షాన్ని, బస్టాండ్ దగ్గర నిర్మిస్తున్న త్రీ స్టార్ హోటల్, ఎకో పార్కులో చేపట్టాల్సిన పనులు, శిల్పరామాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలమర్రి వృక్షానికి విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి కోసం రూ.5 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం అభివృద్ధి కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటన్నింటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మన దేశంలో, రాష్ట్రంలో ఎన్నో టూరిజం ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. శిల్పరామంలోని షాపులను మహిళా సంఘాలకు, చేతి వృత్తుల వారికి కేటాయించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లడుతూ మయూరి ఎకో పార్కు వెనక హరిత హోటల్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లికి విజప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్రప్ర తాప్, ఎస్పీ జానకి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, తదితరులు ఉన్నారు.






