28 August, 2026 | 8:37 PM

పాడి పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు కృషి

28-08-2026 04:04 PM

ఆగస్టు 16 నుండి లీటరు పాలుకు 1.50 పైసలు ప్రభుత్వం పెంచింది..

ఉట్నూర్, ఆగస్టు 28 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలో  పాడి పరిశ్రమను పెంపొందించేందుకు  జిల్లా కలెక్టర్  రాజర్శి షా(Collector Rajarshi Shah) ఆదేశాల మేరకు  కృషి చేస్తున్నామని  విజయ డైరీ మేనేజర్ అఖిల్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని పాల సేకరణ కేంద్రాన్ని దక్కన్ గ్రామీణ బ్యాంక్  మేనేజర్లతో సందర్శించారు. ఈ సందర్భంగా ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ఆవు, గేదె పాలు  తీసుకువచ్చే రైతులతో  వారి వారి అభిప్రాయాలను  తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పాడి రైతులను ఉద్దేశించి  విజయ డైరీ మేనేజర్ అఖిల్ తో పాటు  దక్కన్ గ్రామీణ బ్యాంక్ బిజినెస్ సీనియర్ మేనేజర్ అరుణ్ కుమార్, ఉట్నూర్ డివిజన్ బిజినెస్ మేనేజర్ నరేష్, ఇంద్రవెల్లి దక్కన్ గ్రామీణ బ్యాంక్  మేనేజర్ మధుసూదన్లు మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాడిని అభివృద్ధి చేసేందుకు  విజయ డైరీ తో పాటు  దక్కన్ గ్రామీణ బ్యాంకు ద్వారా  పాడి రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నామని  అన్నారు. విజయ డైరీ కి పాలు తీసుకొచ్చే రైతులకు రెండు లక్షల నుండి  5 లక్షల వరకు  దక్కన్ గ్రామీణ బ్యాంకు నుండి  రుణాలు అందించుటకు  సిద్ధంగా ఉన్నామని గుర్తు చేశారు.

పాడి రైతులు  పాల సేకరణ కేంద్రానికి తీసుకువచ్చిన సమయంలో  వారు అమ్మే పాలు  కు రాష్ట్ర ప్రభుత్వం  ఈ ఆగస్టు 16వ తేదీ నుండి  లీటరుకు 1.50 పైసలు పెంచిందని విజయ డైరీ మేనేజర్  అఖిల్ రైతులకు వివరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పాడి పశువులను పెంచుకొందుకు  రైతులు సిద్ధంగా ఉన్నామని, ఆవులకు గేదెలకు కావలసిన  దాన ను ప్రభుత్వం సరఫరా చేయాలని  కోరారు. గతంలో 75% సబ్సిడీపై  రైతులకు కావలసినంత  దానా సరఫరా చేశారని  విజయ డైరీ మేనేజర్, బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల మాటగా  జిల్లా కలెక్టర్ రాజర్శి షా దృష్టికి తీసుకువెళ్లి  పాడి రైతులకు, విజయ డైరీ కి  పాలు తీసుకువచ్చే రైతులకు  70 శాతం సబ్సిడీపై  దాన సరఫరా చేసే విధంగా  విన్నవించాలని ఉట్నూర్, ఇంద్రవెల్లి  మండలాల పరిధిలోని వివిధ గ్రామాల పాడి రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో పాల సేకరణ సూపర్వైజర్  అనిల్  పాల్గొన్నారు.