గణప సముద్రం సరస్సు కాల్వల మరమ్మతులకు రూ. 31 కోట్లు
- త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం
- టెండర్ల అనంతరం 9 నెలల్లో పనులు పూర్తి
- రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు
- ఇరిగేషన్ శాఖ సీఈ ధర్మ
- అధికారులతో కలిసి సరస్సు కాల్వల పరిశీలన
భూపాలపల్లి/గణపురం,ఆగస్టు 28 (విజయ క్రాంతి): కాకతీయులు నిర్మించిన గణప సముద్రం సరస్సు కాలువల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 31 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ ధర్మ తెలిపారు. శుక్రవారం ఆయన సరస్సు ఆయకట్టు కాలువలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మత్తడి కాలువ, కొత్త కాలువ, కోట కాలువ, పైడి కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే ప్రత్యేకంగా పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి నిధుల మంజూరుకు కృషి చేశారన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందేందుకు కాల్వల మరమ్మతు పనులు ప్రారంభిస్తామని అన్నారు. మరో పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని 9 నెలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయనున్నట్లు సి ధర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈ ఈ, రాము, ఎస్ సి మోహన్ రావు, ఏఈలు సమ్మారావు శ్రీనివాస్, గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్,మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్, దూలం కుమారస్వామి గౌడ్, మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు గంధం ఓదాకర్, పచ్చిమట్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.






