20-11-2025 10:46:25 PM
* జ్యోతిర్వాస్తు విద్యా పీఠంలో ప్రపంచంలో అతి పెద్ద నంది విగ్రహం
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి (విజయక్రాంతి): హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాలకు సంబంధించిన ఆలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాలు, ఇతర ధార్మిక కార్యక్రమాల కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అవసరమైన నిధులు కేటాయించేలా చొరవ తీసుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. త్వరలో సంగారెడ్డి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని వివరించారు. గురువారం సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఎర్దనూరు గుట్టల్లో అవసరమైన పెద్ద రాయిని కనుగొన్నారు. ఆ బండరాయిని సంగారెడ్డిలోని విద్యాపీఠానికి త్వరలోనే తీసుకొచ్చేలా పనులు ప్రారంభించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ పనులను పరిశీలించారు. నంది విగ్రహ నమూనాను ఈ సందర్భంగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సిద్ధాంతి డాక్టర్ మహేశ్వరశర్మ ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ తదితరులు పాల్గొన్నారు.