బీహార్లో కారు-ట్రాక్టర్ ఢీ: 8 మంది దుర్మరణం
కటిహార్: బీహార్లోని కటిహార్ జిల్లా(Katihar District)లో మంగళవారం తెల్లవారుజామున హోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. కారు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారులోని ప్రయాణికులు వివాహ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా సోమవారం మధ్య రాత్రి సమేలి బ్లాక్ ఆఫీసు వద్ద ఈ ప్రమాదం జరిగిందని, బాధితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. "సమేలి బ్లాక్ ఆఫీస్ సమీపంలోని నేషనల్ హైవే-31 పై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఒక ఎస్ యూవీ వాహనం ఢీకొన్న ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మరణించారు, మరో ఇద్దరు గాయపడ్డారు" అని కటిహార్ ఎస్పీ వైభవ్ శర్మ(Katihar SP Vaibhav Sharm)తెలిపారు.
వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎనిమిది మంది మరణించినట్లు ప్రకటించారు. గాయపడిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల ప్రకారం, బాధితులు సుపాల్ నివాసితులు, బాధితులందరూ ఎస్ యూవీలో ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం పరీక్ష కోసం మార్చురీకి తరలించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ వైభవ్ శర్మ వెల్లడించారు.






