07-06-2025 09:15:35 PM
ఆస్తి పంపకం చేపట్టనందుకు, మూడవ కుమారుడు వేధిస్తున్నాడు..
ఏఎస్పీని కలిసి గోడు వెల్లబోసుకున్న వృద్ధ దంపతులు..
కామారెడ్డి (విజయక్రాంతి): మేం బతికున్నంత కాలం... తన పేరిట ఉన్న భూమి పంపకాలు చేపట్టలేమని చెప్పినా పాపానికి, తమ మాటలను పట్టించుకోకుండా తన వాటా కింద వచ్చే భూమిని అమ్ముకుంటానంటూ మూడవ కుమారుడు తమను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, ఆ తల్లిదండ్రులు శనివారం కామారెడ్డి ఎస్పీ చైతన్య రెడ్డి(SP Chaitanya Reddy)ని కలిసి వారి గోడును వెళ్ళబుచ్చారు. ఆ భూమిని పంచివ్వనందుకు ఇంట్లో నుంచి తమను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేశాడని ఆవేదన వ్యక్తం చేశారు, శనివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన మర్రి బాగవ్వ- రామయ్య అనే వృద్ధ దంపతులకు నలుగురు కుమారులు ఉన్నారు. తన పేరున 5,04 ఎకరాల భూమి( సర్వే నంబర్ 1530) ఉంది. దీంట్లో నుంచి నలుగురు కొడుకులకు ఎకరం చొప్పున పట్టా చేసివ్వగా,తండ్రి రామయ్య పేరున 1,04 గుంటల భూమిని తన పేరున పట్టా చేయించుకున్నాడు. మూడవ కుమారుడు చంద్రం ప్రేమ వివాహం చేసుకొని నిజామాబాద్ పట్టణంలో ఉంటూ, తమ బాగోగులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్న చంద్రం, తమను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి, ఇంటికి తాళం వేశాడని వాపోయారు.
తన పేరిట ఉన్న భూమిని వాటా కింద పంచిస్తే, ఆ భూమి ని అమ్ముకొని తాను చేసిన అప్పులు కట్టుకుంటానని, వేధిస్తున్నాడని ఆరోపించారు. తాము బతికున్నంత కాలం, తన పేరిట ఉన్న భూమిని ఎవరికి పంచి ఇవ్వమని, తమను ఎవరు బాగా చూసుకుంటే వారికే భూమి ఇస్తామని తేల్చి చెప్పామన్నారు. అయితే చంద్రం తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఒక వ్యక్తి, తన భూమిలో సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నలుగురు కొడుకులలో ముగ్గురు బాగానే చూసుకుంటున్నా, మూడో కొడుకుతోనే తాము నరకం చూస్తున్నామని వాపోయారు. ఈ విషయమై కామారెడ్డి ఏఎస్పీ బొక్క చైతన్య రెడ్డిని కలసి గోడు వెల్లబోసుకోగా, న్యాయం చేస్తానని చెప్పి భిక్కనూరు పోలీస్ స్టేషన్ కు పంపించిందని విలేకరులతో మాట్లాడుతూ వివరించారు.
కొడుకు కోడలుతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు...
తల్లిదండ్రులను భూమి విషయమై వేధింపులకు గురి చేస్తున్న, కొడుకు, కోడలుతో పాటు, భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన మరో వ్యక్తి, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు సాయంత్రం "విజయక్రాంతి ప్రతినిధి"తో మాట్లాడుతూ వివరించారు.