09-02-2026 05:06:04 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎన్నికల పరిశీలకులు కె. శివ కుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ ల సమక్షంలో పరకాల పురపాలక ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. పరకాల పురపాలక సంఘంలో 22 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికల విధులను నిర్వర్తించే పోలింగ్, అదనపు పోలింగ్ అధికారులు, ఓపీవోల ఆయా వార్డులకు ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
22 వార్డులకు 44 పోలింగ్ కేంద్రాలు ఉండగా 44మంది పోలింగ్ అధికారులు, అదనంగా 9 మందితో కలిపి 53మంది, ఓపీవోలు 132 మంది, అదనంగా ఇరవై శాతం కలిపి 158మంది, అదేవిధంగా రిజర్వు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపు చేశారు. ఈ సందర్భంగా పరకాల పురపాలక కమిషనర్ అంజయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ ప్రజల నుండి 118 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను సంబంధిత అధికారులు త్వరగా పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు పాల్గొన్నారు.