31-12-2025 09:38:27 PM
సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్
వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం
కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రమం తప్పకుండా సదరం శిబిరాలు నిర్వహించాలని, అర్హులకు సదరం సర్టిఫికెట్లు అందించాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. సదరం శిబిరాల నిర్వహణ, యూడీఐడీ తదితర అంశాలపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, అధికారులతో సెర్ప్ సీఈవో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లాల వారీగా సదరం శిబిరాల నిర్వహణ, పెండింగ్ అప్లికేషన్ల వివరాల పై ఆరా తీశారు.సెర్ప్ సీఈవో మాట్లాడారు. సదరం శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, దరఖాస్తుదారులకు సమాచారం చేరవేయాలని, వారు ఆబ్సెంట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. భవనాలు, ఫర్నిచర్, ఇతర సౌకర్యాల కోసం నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం అవసరమైన వైద్యులను నియమించు కోవాలని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి వెంటవెంటనే నిర్ధారణ శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. యూడీఐడీ కార్డుల జారీ, ఇతర అంశాలపై వివరించారు.
జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తాం..
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైకల్య నిర్ధారణ పరీక్ష కేంద్రంలో అన్ని వసతులు కల్పిస్తామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. అప్లికేషన్లు పెండింగ్ లో లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్, డీపీఎం వంగ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.