22 July, 2026 | 7:31 PM

గిరిజన ఆశ్రమ పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

22-07-2026 06:23 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్ నాయకులు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీఓ)కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ... జిల్లాలోని పలు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

తరగతి గదులు సరిపోక విద్యార్థులు ఇరుకు గదుల్లోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ దశలో ఉన్న పాఠశాల భవనాలను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. వావ్దాం గిరిజన ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేక గ్రామపంచాయతీ కార్యాలయంలో తరగతులు నిర్వహిస్తున్నారని, ఆ పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని వేగవంతం చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుని విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.