అర్హులైన ప్రతి ఒక్క కార్మికుడు లేబర్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలి
- సహాయ కార్మిక అధికారి కమ్రోద్దీన్
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా కార్మిక శాఖ స్పెషల్ డ్రైవ్
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మికులకు లేబర్ కార్డు కొరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా సహాయ కార్మిక అధికారి కమ్రోద్దీన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క కార్మికుడు లేబర్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. గాంధారి మండల కేంద్రంలోని హరాలే గార్డెన్స్ లో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులకు ప్రభుత్వం నుండి వచ్చే ఇన్సూరెన్స్, వివిధ పథకాల గురించి వివరించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. అందులో భాగంగానే అర్హులైన కార్మికులకు నూతన లేబర్ కార్డుల కొరకు దరఖాస్తులు స్వీకరించారు, గతంలో లేబర్ కార్డులు ఉండి సరైన సమయంలో రెన్యువల్ చేసుకోక ల్యాప్స్ అయిన లేబర్ కార్డులను తిరిగి రెన్యువల్ చేశారు. స్థానిక సర్పంచ్ మమ్మాయి రేణుకా సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ ప్రతిఒక్క భవన నిర్మాణ కార్మికునికి లేబర్ కార్డు ఉండేలా గ్రామపంచాయతీ తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. త్వరలోనే భవననిర్మాణ కార్మికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి లేబర్ కార్డు పై అవగాహన కల్పిస్తామని అన్నారు.






