పొలిమేరల ఎడ్లబండ్ల దారులు ఆక్రమణలు
గ్రామాలలో వివాదాలు
బోథ్,(విజయక్రాంతి): విత్తనాలు నాటే సమయం ఆసన్నం అయ్యే సమయానికి గ్రామాలలో పొలిమేర దారులతోపాటు పొలాలకు వెళ్లే దారుల విషయంలో ప్రతి ఏటా వివాదాలు చెలరేగుతున్నాయి. ఫలితంగా గ్రామాలలో కక్షలకు కారణం అవుతున్నాయి. వేసవికాలంలో దుక్కులు దున్నించే రైతులు కొంతమంది తమ చేలకు ఉన్న సరిహద్దులను దాటి గెట్లను చేరిపివేసి పొలాలకు వెళ్లే దారులను సహితం దున్నివేయడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గ్రామాలలో వివాదాలు చెలరేగి కక్షలకు కారణమవుతున్నాయి.
ఒకప్పుడు ఎనిమిది మీటర్ల వెడల్పులో ఉన్న పొలం దారులు క్రమక్రమంగా రెండున్నర మూడు మీటర్ల కి చేరుకుంటున్నాయి. పొలం బాటలకు ఇరువైపులా ఉన్న భూ యజమానుల స్వార్థంతో ఈ విధమైన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. మండలంలోని కౌటా కనుగుట్ట గ్రామాల పొలిమేరలలో ఉన్న ఎడ్ల బండ రహదారిని రైతులు దునివేయడంతో గ్రామాభివృద్ధి కమిటీ వారు పంచాయతీ పాలకవర్గం సభ్యులు అడ్డుకున్నారు. అంతేగాక దున్నిన ఎడ్ల బండ్ల రహదారిని యధా విధంగా ఉండే విధంగా చదును చేయించారు. దీంతో సమస్య సద్దుమణి గింది.
రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలి..
పొలాలకు వెళ్లి రహదారులు అనేక గ్రామాలలో ఆక్రమణలకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు రైతులను చైతన్యం చేసి ఆక్రమణలకు గురైన రహదారులను యధా విధిగా ఉండేలా చర్యలు చేపట్టాలని రైతుల కోరుతున్నారు. వివాదాల నుండి దూరంగా ఉండాలంటే రెవెన్యూ అధికారులే పొలం బాటలపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.






