calender_icon.png 22 October, 2024 | 9:14 PM

కృష్ణా ప్రాజెక్టులపై సుప్రీంలో విచారణ

10-07-2024 02:39:38 AM

  • ఆగస్టు 20 లోపు అఫిడవిట్‌కు కేంద్రానికి ఆదేశాలు 
  • తదుపరి విచారణ ఆగస్టు 2౦న 

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ చేపట్టింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఇతర అవసరాలకు అనుమతులు లేకుండా నీటిని వాడేస్తున్నట్లుగా గతంలో సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో జస్టిస్ అభయ్ ఓఖా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మైష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం నుంచి తగిన ఆదేశాలు తీసుకుని తాజాగా అఫిడవిట్ దాఖలు చేస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా కోర్టుకు తెలిపారు. కృష్ణా పరీవాహక ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ గతంలోనే చెప్పింది.

ఇదే అంశంపై విముఖత వ్యక్తం చేస్తూ తెలంగాణ అఫిడవిట్ దాఖలు చేసింది. రెండు ప్రభుత్వాల అభిప్రాయాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇరు రాష్ట్రాల న్యాయవాదులు పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని భాటియా కోర్టుకు వివరించారు. ఈ విషయంలో కేంద్రం నుంచి తగిన సూచనలు, ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆగస్టు 20 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.