12-06-2025 12:13:36 AM
కరీంనగర్, జూన్ 11 (విజయ క్రాంతి): పిల్లల పరిపూర్ణ మానసిక వికాసానికి, శారీరక ఎదుగుదలకు అంగన్వాడీలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం అంగన్వాడీ కేంద్రాలు పున: ప్రారంభమైన నేపథ్యంలో నగరంలోని కార్ఖానా గడ్డ అంగన్వాడి కేంద్రంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 3 నుండి ఆరేండ్ల లోపు పిల్లందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అన్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆట పాటలతో కూడిన విద్య అందిస్తారని తెలిపారు. ప్రతి రోజూ పోషకాలతో కూడిన ఆహారం అందించడంతో పాటు పిల్లల వయస్సుకు తగిన ఎత్తు, బరువుతో ఉండేలా చూస్తారని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తారని తెలిపారు. ఈ నెల 17 వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కువ మంది చేరేలా చూడాలని ఐసిడిఎస్ సిబ్బందికి సూచించారు.
అంగన్వాడీ పునః ప్రారంభం సందర్బంగా పిల్లలకు కోడిగుడ్డు బిర్యానీ సిద్ధం చేయగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా పిల్లలకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడీపీఓ సబితపాల్గొన్నారు.