13-11-2025 12:06:45 AM
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సుల్తానాబాద్ నవంబర్ 12 (విజయక్రాంతి):కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం కు సంబంధించిన డబ్బులు రైతులకు 48 గంటల్లోపు చెల్లింపులు జరిగేలా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.. బుధవారం సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు.
సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి జాప్యం లేకుండా దిగుమతి అయ్యేలా చూడాలని అన్నారు. హమాలీల సమస్య లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కే. శ్రీనాథ్, సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.