కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలి
ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, ఏప్రిల్ 15 : ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లను గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని అన్నారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






