27-05-2025 12:23:00 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, మే 26 (విజయ క్రాంతి): ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో పయనించాలని శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
సోమవారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని క్రీడా మైదానంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాన కొండూర్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు, బెట్టింగులు, డ్రగ్స్ కు అలవాటుపడి యువకు లు భవిష్యత్తును విచ్ఛిన్నం చేసుకోవద్దని కోరారు.
యువత పెడదారి పట్టకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు యువత భవితకు ధీమా కల్పిస్తాయని పేర్కొన్నారు. క్రీడల వల్ల మానసికోల్లాసం కలుగుతుందని,అందుకే యువజన కాంగ్రెస్ తరఫున క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పే ర్కొన్నారు.
యువకుల్లో మార్పు కోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్ధాలకు యువకులు దూరంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో యువకుల్లో మార్పును ఆశిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్మమెంట్ నిర్వహించడం ముదావహమన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, మామిడి అనిల్ కుమార్, ద్యావ శ్రీనివాస్ రెడ్డి,క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు గుర్రం వాసు, తాళ్లపల్లి శ్రీకాంత్, తుర్తి అరవింద్, ఎల్కపల్లి సిద్దార్థ్, ముక్కెర సతీష్ కుమార్, మహేశ్ చంద్ తదితరులుపాల్గొన్నారు.