05-06-2025 01:13:25 AM
రాత్రికి రాత్రే కూలీలను, సామగ్రిని దించిన యాజమాన్యం
గద్వాల, జూన్ 4 (విజయక్రాంతి): గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామ సమీపాన ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం మండల పరిధిలోని 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. కంపెనీ ఏర్పాటు వల్ల కాలుష్యం ఏర్పడి, పచ్చని పంట పొలాలు బీడు భూములుగా మారుతాయని, తామంతా అనారోగ్యాల బారిన పడుతామంటూ నిరసన వ్యక్తం చేశారు.
గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ పోరాటాలు చేయగా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దల హామీలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయిందనుకున్న పెద్ద ధన్వాడ గ్రామ ప్రజలతో పాటు 10 గ్రామాల ప్రజలకు గాయత్రి కంపెనీ యాజమన్యం షాక్ ఇచ్చింది.
సోమవారం అర్ధరాత్రి ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్, జేసీబీలను, కొంతమంది ప్రైవేట్ సిబ్బంది, కూలీలను దింపింది. బుధవారం ఈ విషయం తెలుసుకున్న 10 గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందుకు ప్రజా సంఘాల నాయకులు సైతం మద్దతు తెలిపారు.
పెద్ద ధన్వాడ ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఉదయం నుంచి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవ్వరినీ కూడా ఇథనాల్ కంపెనీ పరిసరాల్లోకి రానీయకుండా గట్టి భద్రతను కల్పించారు. అంతేకాకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని హౌజ్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉగ్రరూపం దాల్చింది.
తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అరెస్టు ఎలా చేస్తారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేసే స్థలానికి పలు గ్రామాల ప్రజలు చేరుకున్నారు. ఒక్కసారిగా 10 గ్రామాల ప్రజలు, రైతులు 200 మంది అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిన అదుపులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. ప్రజలు కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో ఆయా గ్రామాల రైతులు, ప్రజలు ఇథనాల్ కంపెనీ కోసం ఏర్పాటు చేసిన కంటైనర్కు నిప్పు పెట్టారు. పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా చేసే నిరసనలకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలుస్తున్నది.
పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులను రద్దు చేసే వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటామని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరించారు. కాగా ఈ ఘటనకు కారకులైన ముఖ్య నాయకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.