31-12-2025 01:30:20 AM
మలయాళీ క్రేజీ బ్యూటీ మాళవిక మోహనన్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇటీవలే హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిం చింది.
మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్రబృందం వరుస ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్నారు. ఇందులోభాగంగా కథానాయకి మాళవిక కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో తాను కీలక పాత్రలో కనిపించిన తర్వాత తన జీవితంలో ఎదురైన పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. “నటీనటులకు పర్ఫెక్ట్ లాంచ్ అవసరమని నేను అనుకునేదాన్ని.
దీపికా పదుకొణె ‘ఓం శాంతి ఓం’తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. నేను కూడా అలాగే ఓ పెద్ద సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా. నేనే కాదు, చాలామంది యంగ్ యాక్టర్స్ ఇలాగే ఫీల్ అవుతారు. కానీ పర్ఫెక్ట్ సినిమా అంటూ ఏదీ ఉండదని అర్థమైంది. స్టార్ హీరోల సినిమా అయినా, గొప్ప దర్శకుల చిత్రమైనా ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని తెలుసుకున్నాను. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే ఎవరైనా బోల్తా కొట్టక తప్పదని అర్థమైంది. ‘బియాండ్ ద క్లౌడ్స్’ సినిమా చూసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నాకు రజనీకాంత్ ‘పేట’ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు.
అది హీరోయిన్ అవకాశం కానప్పటికీ రజనీకాంత్తో నటించే అదృష్టాన్ని వదులుకోవాలనుకోలేదు. అందుకే నాది సైడ్ క్యారెక్టర్ అయినా ఒప్పుకున్నా. కానీ, ఆ సినిమా చేసినతర్వాత నాకు అన్నీ అలాంటి రోల్సే రావడం మొదలైంది. ఇకపై సైడ్ రోల్స్ మాత్రమే వస్తాయంటూ కొందరు నిర్మాతలు అన్నారు. నటీనటులను ఇంత త్వరగా జడ్జ్ చేస్తారని అప్పుడే అర్థమైంది. ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను. అంటే నేను మంచి రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పకనే చెప్పాను. ఇక్కడ జనం మన మైండ్లో ఏవేవో ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. కానీ, మనం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.