18-07-2025 12:11:07 AM
మహబూబాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం అందించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ వైద్యులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను గురువారం ఎమ్మెల్యే మురళీ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిని, అందుతున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో పేద, మధ్య తరగతి వారికి మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. డాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రభుత్వ దవాఖాన సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రత్యేకంగా సిజేరియన్ డెలివరీలను ప్రోత్సహించకూడదన్నారు.
ఇకపై పాయిజన్ కేసులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. త్వరలో అధునాతన డయాలసిస్ సౌకర్యం అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఎమ్మెల్యే స్వయంగా స్టేతస్కోప్ ధరించి పలు వార్డులను తనిఖీ చేసి, రోగులను పరామర్శించారు. వైద్యులు, సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇకనుంచి ప్రతి నెల ఆసుపత్రిని తనిఖీ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట్ లకావత్, సివిల్ హాస్పిటల్ ఆర్ ఎం ఓ డాక్టర్ జగదీశ్వర్ పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని 115 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ ద్వారా మంజూరైన రూ. 36 లక్షల 65 వేల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.