ప్రతి కానిస్టేబుల్ గ్రామాలను సందర్శించి సమస్యలు తెలుసుకోవాలి
- మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్
- కాసిపేట్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన మంచిర్యాల డీసీపీ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జోన్ డీసీపీ ఏ.భాస్కర్, కాసిపేట్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు చేరుకున్న డీసీపీ,స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం రిసెప్షన్, ఐటీ విభాగం,ఇతర పోలీసు సిబ్బంది పనితీరును సమీక్షించారు. అలాగే స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలు, పెండింగ్ కేసుల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ... బాధితుల ఫిర్యాదులపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని సూచించారు. ప్రతి కానిస్టేబుల్ తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా చైతన్యం తీసుకురావాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రోత్సహించాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్,మందమర్రి సీఐ పర్స రమేష్, కాసిపేట్ ఎస్సై ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






