calender_icon.png 19 October, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దండుపాళ్యం’ పాలన ఎవరిదో అందరికీ తెలుసు

19-10-2025 12:47:12 AM

  1. అసహనం, నిరాశతోనే మా క్యాబినెట్‌పై నిరాధారమైన ఆరోపణలు
  2. వాళ్ల అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకునేందుకే మాపై కట్టుకథలు
  3. గత పాలనా వైఫల్యాల చరిత్రను దాచేందుకే మైండ్ గేమ్
  4. మా మంత్రులందరిదీ ఒకటే జెండా... ఒకటే అజెండా... 
  5.   20నెలల్లోనే రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
  6. రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : ‘దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో అందరికీ, ముఖ్యం గా ఈ రాష్ర్ట ప్రజలకు బాగా తెలుసని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అందుకే గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశా రు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో క్యాబినెట్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయ న శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

మంత్రుల మధ్య కుమ్ములాటలు, క్యాబినెట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారంతా సినిమాల్లో ‘రచయితలు’గా ప్రయత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సమష్ఠిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు.

భావితరా ల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అజెండా అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. మాకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే మా అందరి అజెండా అని వివరించారు. ‘విలువ ఆధారిత వృద్ధే’ లక్ష్యంగా మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని పేర్కొన్నారు. మేం పాలనను గాలికొదిలేస్తే గత 20 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు.

మంత్రులంతా వ్యక్తిగత పం చాయితీలు పెట్టుకుంటే “ఎలీ లిల్లీ” లాంటి అంతర్జాతీ య దిగ్గజ కంపెనీలు తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మాది మాటల ప్రభుత్వం కాదని... చేతల్లో చేసి చూపించే ప్రజా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని సూచించారు.

మీ అహంకారపూరిత వ్యవహారశైలి, పాలనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.  రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

6 నెలల్లోనే రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐలు 

‘పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ మాపై దుష్ర్పచారం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ. 12,864 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. 2023-24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్-3 అర్బన్ ఎఫ్ డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది’ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

‘2023--24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు. అది 2024-25లో 12.6 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 8.68 శాతం. గతేడాదితో పోలిస్తే 2.1 శాతం అధికంగా నమోదయ్యింది. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 6.2 శాతం మాత్రమే’ అని పేర్కొన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు.