19-10-2025 12:43:41 AM
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట బీజేపీ, కాంగ్రెస్ పార్టీ డ్రామా లు చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. గడిచిన 35 ఏళ్లలో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బీజేపీ 17 ఏళ్లు పాలిస్తే ఏనాడూ ఆ పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీజేపీ కేం ద్రంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో అధికారంలో ఉన్నాయని, ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరని ప్రశ్నించారు.
ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్లమెంట్లో బీజేపీకి 240 మంది ఎంపీలు, కాంగ్రెస్కు 99 ఎంపీల బలం ఉండగా రిజర్వేషన్ల బిల్లు పెంపును అడ్డుకునేది ఎవరని నిలదీశారు. రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెం డు జాతీయ పార్టీలు బీసీల ను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయని, బీసీలను అవమానిస్తున్నాయని విమర్శించారు. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ గణన చేయలేదని, బీజేపీ అయితే ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నదని తెలిపారు.
గడిచిన 35 ఏళ్లలో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బీజేపీ 17 ఏళ్లు పాలిస్తే ఏనాడూ ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్ అని, రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడంతోపాటు స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తిచేశారని గుర్తు చేశారు.
అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదని, ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదని, బీసీ మం త్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ‘జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్క్’ అని నినదించే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గానీ, బండి సంజయ్ గానీ, 8 మంది బీజేపీ ఎంపీలు గానీ ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు.
రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మిం చి ఇంకొకరు నటిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని, ఎలాంటి పోరాటానికైనా బీఆర్ఎస్ కలిసి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి, ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాం గ్రెస్, బీజేపీని డిమాండ్ చేశారు.