బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అశ్వాపురంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా న్యాయ సేవల సంస్థ
అశ్వాపురం, జూన్ 12 (విజయక్రాంతి): ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అశ్వాపురం మండలంలోని బ్రిక్ లైన్ పరిశ్రమ వద్ద ఇటుక బట్టీల యజమానులకు జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవల సంస్థ మేజిస్ట్రేట్ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో నియమించరాదని, వారికి విద్యను అందించి భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. బాల కార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టంలోని నిబంధనలను వివరించిన ఆయన, బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
పిల్లలను పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తును బంగారు బాటలో నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలోచన నాగరాజు, బ్రిక్స్ యూనియన్ అధ్యక్షుడు మర్రి మల్లారెడ్డి, గౌరవ అధ్యక్షుడు కొండలరావు, గుర్రం రవీందర్, ఆకిటి రవీందర్ రెడ్డి, వడ్డెంపూడి రాము, నర్సిరెడ్డి, నాగేశ్వరరావు, ఎల్లారెడ్డి, జయచంద్రారెడ్డి, బద్దం వెంకటరెడ్డి, ఇటుక బట్టీల యజమానులు తదితరులు పాల్గొన్నారు.






