23-06-2025 05:45:53 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ...
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో స్త్రీ, శిశు, పయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్(Nasha Mukt Bharat Abhiyaan) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... యువత డ్రగ్స్ అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని, భయంకరమైన వ్యసనాల నుండి ప్రజలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
డయేరియా నిర్మూలనకు కృషి చేయాలి
డయేరియా వ్యాధి బారిన పడకుండా, పరిసరాల పరిశుభ్రత, వర్షాకాలంలో అనుసరించాల్సిన ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, స్టాప్ డయేరియా 2025 క్యాంపెనింగ్ సమన్వయ కమిటీ ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. 0-5 సంవత్సరాల చిన్నారులు అతిసార వ్యాధి బారిన పడే అవకాశం ఉందని, అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. భోజనానికి ముందు తప్పకుండా చేతులు శుభ్రం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని, సురక్షిత తాగునీరు, ఆహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో వాన నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై స్వీకరించిన 64 దరఖాస్తులకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సమస్యలను పరిష్కరించాలని, దరఖాస్తులను పెండింగ్లో ఉంచకూడదని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జాతి చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి పంపించారు. ఆయా కార్యక్రమాల్లో సబ్ కాటారం సబ్ కలెక్టర్ మాయాక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీవో రవి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, ఎక్సైజ్ ఈ ఎస్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఈవో రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి క్రాంతి కిరణ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి, ప్రమోద్ పాల్గొన్నారు.