16-02-2026 01:38:17 AM
మెజార్టీ స్థానాలు దక్కించుకోని పార్టీలు
రంగంలోకి కేంద్ర మంత్రి అమిత్షా
బీఆర్ఎస్తో బీజేపీ పెద్దల చర్చలు!
కాంగ్రెస్కు స్వతంత్రుల మద్దతు?
కామారెడ్డి, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పీఠంపై చిక్కుముడి వీడలేదు. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీని పట్టణ ప్రజలు కట్టబెట్టలేదు. దీంతో బీఆర్ఎస్ కీలకంగా మారింది. బీఆర్ఎస్కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్కు 19 మంది కౌన్సిలర్ ఉండగా మరో ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్లో చేరారు. మరో నలుగురు మద్దతు లభిస్తే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది.
బీజేపీ 16 స్థానాలు గెలుపొంది చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నది. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ అధిష్ఠానం పెద్దలతో బీజేపీ అధిష్ఠానం పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారంటూ వార్తలు రావడంతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు.
కాంగ్రెస్లోకి వెళ్లలేదంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు పిట్ల వేణుగోపాల్, అజీజ్, గిరిగంటి స్వప్న, గేరుగంటి లక్ష్మీనారాయణలతో స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్ వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్లో చేరలేదంటూ వారితోనే చెప్పించారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకోలేనట్లు తెలుస్తున్నది. దీంతో సోమవారం కామారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
బీఆర్ఎస్ మద్దతు ప్రకటించే పార్టీ కామారెడ్డి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటుంది. కాంగ్రెస్ అధిష్టానం షబ్బీర్ అలీకి బాధ్యతలను అప్పగించింది. మున్సిపల్ పీఠంపై నిర్ణయాన్ని కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రం మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.