కథలో కామెడీ ఉండాలి

02-05-2024 12:05:00 AM

అల్లరి నరేష్  పూర్తి వినోదాత్మక చిత్రం  ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా  హీరోయిన్‌గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం విరామం తరువాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మే 3న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో హీరో అల్లరి నరేష్ విలేఖరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మళ్ళీ కామెడీ సబ్జెక్ట్ చేయడానికి కారణం ?

-అన్నీ సమాంతరంగా చేయాలనే అలోచనతోనే వున్నాను. నాంది, మారేడుమిల్లి, ఉగ్రం, నా సామిరంగా దేనికవే భిన్నమైన సినిమాలు. కామెడీ కథలు బాగా నచ్చితేనే చేయాలని భావించాను. ప్రేక్షుకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ వుంటేనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లి గారు ఈ కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లిని ఇప్పటివరకూ ఫన్ తో చూపించారు.  ఐతే ఇందులో దాని వెనుక ఒక సమస్య, స్కామ్, పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది.  సినిమా అంతా ఎంటర్ టైనర్‌గా వుంటుంది. చివరి రెండు రీళ్లలో ఎమోషనల్ టచ్ ఉంటుంది.

కొత్త దర్శకుడు ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది?

-దర్శకుడు మల్లి ఈ కథ చెప్పినపుడు అందులోని పాయింట్‌కి చాలా కనెక్ట్ అయ్యాను. నిజ జీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. కథలో సహజత్వం వుట్టిపడుతుంది. కామెడీ లోనే చక్కని సందేశం వుంది. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోజింపచేసేలా వుంటుంది. మల్లి ఈ కథని చాలా బలంగా రాసుకున్నారు. దీనికి రచయితగా అబ్బూరి రవిగారు తోడయ్యారు. కామెడీ, ఎమోషన్ అద్భుతంగా రాశారు.

కామెడీ, మెసేజ్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు ?

-సినిమా ఆద్యంతం నవ్వులు పంచినప్పటికీ చివర్లో ఎదో మంచి సందేశం వుండాలి. కితకితలు కామెడీ సినిమానే. కానీ అందులో చూపించిన ’ఇన్నర్ బ్యూటీ’ సందేశం ప్రేక్షకులకు అద్భుతంగా కనెక్ట్ అయ్యింది. నాన్నగారి సినిమాల్లో కూడా అంతర్లీనంగా మంచి సందేశం వుంటుంది. ఈ సినిమాలో చూపించే సందేశం కూడా ప్రేక్షకులని కదిలించేలా వుంటుంది.

నాన్న గారి ‘ఆ ఒక్కటీ అడక్కు’లో బాల నటుడిగా చేశారు కదా మళ్ళీ ఆ టైటిల్ తో హీరోగా చేయడం ఎలా అనిపించింది ?

-సమ్మర్ హాలీడేస్‌కి నాన్నగారు షూటింగ్‌లో వుంటే వైజాగ్ వెళ్లాను. అప్పుడు ఏమీ తెలీదు. నటించమంటే చేసేశాను. తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ఈ రోజు అదే టైటిల్ తో సినిమా చేయడం ఫుల్ సర్కిల్‌లా అనిపించింది. ఇప్పుడు చాల మంది అది ఈవీవీ గారి సూపర్ హిట్ టైటిల్ తెలుసా?అంటే.. నాకే కొంచెం టెన్షన్ వస్తుంది. అయితే టైటిల్ తప్పా ఆ సినిమాకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా గమ్మత్తుగా వుంటుంది. మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తుంటాడు కానీ తనకి పెళ్లి కాదు. అది ఇంకా ఫస్ట్రేషన్ (నవ్వుతూ)

గతంలో మీ నుంచి ఏడాదికి కనీసం మూడు సినిమాలు ఉండేవి ?

-ఈసారి వస్తాయి అండీ. ఇప్పటికే నా సామిరంగ వచ్చింది. మే3న ఈ సినిమా వస్తుంది. బచ్చల మల్లి జులై లేదా ఆగస్ట్ లో రావచ్చు. డిసెంబర్ లో మరో సినిమా వచ్చే అవకాశం వుంది.

డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు ?

-ప్రస్తుతం నా దృష్టి నటనపైనే వుంది. దర్శకత్వం చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. అందరూ సుడిగాడు 2 కోసం అడుగుతున్నారు. ఓ ఐడియా వచ్చింది. అది రాస్తున్నా.

‘పెళ్లి’ అనేది యూనివర్సల్ పాయింట్ కదా.. ఈ సినిమా మిగతా భాషల్లో చేసే ఆలోచన ఉందా ?

-నిజానికి రాజీవ్ గారికి ఈ ఆలోచన వుంది. బాలీవుడ్ లో చేయాలని అనుకున్నారు. అయితే ఇక్కడ ఫ్రూవ్ చేసుకుంటే అక్కడ చేసే అవకాశం వుంది.

ఈవీవీ బ్యానర్ మళ్ళీ ఎప్పుడు మొదలుపెడతారు?

-కథలు వింటున్నా అండీ. ఆ బ్యానర్ లో చేయదగ్గ కథ కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాను. ’ఎవడిగోల వాడిది’ లాంటి సినిమా చేయాలని నా కోరిక.

ఇంకా ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలని వుంది ?

-అన్నీ రకాలు సినిమాలు చేయాలి. డార్క్ హ్యుమర్ వున్న కథలు చేయడానికి కూడా ఇష్టపడతాను. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి కథలపై దృష్టిపెడుతున్నాను. అలాగే ’పుష్పక విమానం’ లాంటి మూకీ సినిమా చేయాలని వుంది.అలాగే ’జోకర్’ లాంటి క్యారెక్టర్ చేయాలని వుంది. మనం నవ్వుతుంటే ఆడియన్స్ భయపడాలి.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?

-బచ్చల మల్లి షూటింగ్ జరుగుతోంది. మరో రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాను. త్వరలోనే చెబుతాను.