స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు, పత్రికా వ్యాసాల ప్రదర్శన
సుల్తానాబాద్,(విజయక్రాంతి): దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 'ఎర్త్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు, నాటి చారిత్రక సంఘటనలకు సంబంధించిన పత్రికా వ్యాసాల ప్రదర్శనను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి సందర్శించి "ఎర్త్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ చాలా అభినందనీయం అని అన్నారు.
నాటి స్వాతంత్య్ర ఉద్యమ కాలం నాటి పత్రికా కథనాలను చూస్తుంటే, ఆనాటి పోరాట ఘట్టాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.ఇలాంటి చారిత్రక ప్రదర్శనలు విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయి," అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో దాదాపు 600మంది వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు విచ్చేసి తిలకించారు. ప్రదర్శనను సందర్శించిన విద్యార్థులకు స్వాతంత్య్ర సమర స్ఫూర్తిగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలైన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎర్త్ ఫౌండేషన్ ఫౌండర్ కలవేణి శ్రీనివాస్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇంచార్జి బుచ్చిబాబు, ఫౌండేషన్ కోఆర్డినేటర్ రాజు, శ్రీనివాస్, శ్రీధర్, అలాగే పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






