01-08-2025 10:12:18 PM
వాజేడు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వాజేడు మండలంలో వాజేడు ఎస్సై జక్కుల సతీష్(SI Jakkula Satish), పేరూరు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ శుక్రవారం విస్తృతంగా వాహన తనిఖీ చేపట్టారు. జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండటం కొరకు పోలీసులు గ్రామ గ్రామాన డేగ కన్నుతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాజేడు మండలం పూర్తిగా ఏజెన్సీ మండలం కావడంతో ఆదివాసి గ్రామాల్లో అపరిచితులు సంచరించే అవకాశం ఉన్నందున భద్రత నేపథ్యంలో వాహన తనిఖీలు, కార్డెన్ చర్చ్ లు నిర్వహిస్తూ మావోయిస్టు కదలికలపై నిఘా పెంచారు.
ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ నిర్వహించిన కర్రెగుట్టలకు సమీపంలో ఉన్న వాజేడు మండలంలో మావోయిస్టులు వారోత్సవాలను పురస్కరించుకొని రివేంజ్ తీర్చుకునే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మండలంలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కాగా జక్కుల సతీష్ మండల పరిధిలో గల ఆరుగుంటపల్లి శివారులో వాహన తనిఖీ నిర్వహించి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్ చిన్న గొల్లగూడెం సమీపంలో వాహన తనిఖీ నిర్వహించారు అనుమానితులను ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా చెక్ చేసి ప్రశ్నించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.