రైతు రుణమాఫీ చారిత్రక ఘట్టం
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
సూర్యాపేట, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాపీ దేశ చరిత్రలో ఓ చారిత్రక ఘట్టం అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నెమ్మికల్లో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యం లో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు మేలు చేసే పార్టీ అన్నారు. అందులో భాగంగానే 40 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్రెడ్డి రైతులందరికీ పెద్దకొడుకయ్యాడన్నారు.
విద్యుత్ సంస్థలకు రూ.80 వేల కోట్లు అప్పుల పాలు చేసిన ఘనత ఇక్కడున్న మాజీ మంత్రి జగదీష్రెడ్డిది అన్నారు. ఆయన చేసిన తప్పులకు తగిన శిక్షపడుతుందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్రెడ్డి, కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్ పాల్గొన్నారు.






