24-06-2025 12:28:26 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ జూన్ 23 (విజయక్రాంతి): వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు అందజేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుందన్నారు. సోమవారం నాటికి నిర్మల్ జిల్లాలో మొత్తం రూ.260.80 కోట్ల రైతు భరోసా నిధులు విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు.
జిల్లాలో ఉన్న మొత్తం 1,86,400 మంది రైతుల్లో 1,85,116 మంది ఖాతాల్లోకి నిధులు చేరాయని వివరించారు. మిగిలిన రైతులకు త్వరలోనే నిధులు జమ కానున్నట్లు తెలిపారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఈ పథ కం లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడి భారం తగ్గడం వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు.
చివరి గుంట భూమి వరకు రైతులకు రైతు భరోసా అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని కలెక్టర్ స్పష్టంచేశారు. పంట పనుల ప్రారంభానికి ముందే నిధులు జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.