14-11-2025 11:39:41 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని.. రైతులు ఆయిల్ ఫామ్ పంటపై ఆసక్తి చూపాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరి సాగు తో పాటు ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని రైతులకు సూచించారు.
ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవడం జరుగుతుందన్నారు. మన ప్రాంతంలో కూడా విరివిగా ఆయిల్ పంట సాగు చేసినట్లయితే మేలు జరుగుతుందన్నారు. గత ఎనిమిదేళ్ల నుంచి అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అనురాధ కార్తిలో నారు వేసుకోవాలని సూచించారు. అంతకుముందు సహకార వారోత్సవాల్లో భాగంగా స్థానిక కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించారు. సుల్తానాబాద్ సింగిల్ విండో ఉమ్మడి జిల్లాల్లోనే ఎంతో అభివృద్ధి సాధించటం అభినందనీయమని చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సీఈవో బూరుగు సంతోష్ , పాలకవర్గం, సిబ్బందిని ఎమ్మెల్యే విజయ రమణారావు అభినందించారు.