18-06-2025 11:20:28 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): వానాకాలం సీజన్కు ముందే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం, రైతులకు బాసటగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. వానాకాలం 2025 సీజన్కు సంబంధించి నిర్మల్ జిల్లాలో మొత్తం రైతులు 1,86,400 గాను మంగళవారం నాటికీ BT ద్వారా విజయవంతంగా 1,33,135 మంది రైతులకు రూ.112.86 కోట్లు నిధులు నేరుగా రైతుల ఖాతాలో చేరినట్లు వివరించారు.
రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసినట్లు, మిగిలిన రైతుల ఖాతాల్లోనూ త్వరలోనే నిధులు జమ కాబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకు తగిన పెట్టుబడి సాయం అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పెట్టుబడి భారం తగ్గించడమే కాకుండా, వ్యవసాయ ఉత్పాదకత పెంపుకు ఈ పథకం ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని చెప్పారు. వానాకాలం సాగు ప్రారంభానికి ముందే నిధులు విడుదల కావడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.