05-06-2025 11:44:27 AM
గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్న రైతులు
మహబూబాబాద్, (విజయక్రాంతి): వర్షం నీరు చెరువులోకి రాకుండా రోడ్డు వేస్తున్నారని, వెంటనే వర్షం నీరు వచ్చే విధంగా రోడ్డుకు కల్వర్టు నిర్మించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసే వరద నీరు తమ గ్రామ మహమూద్ సాగర్ చెరువులోకి వస్తుందని చెప్పారు. ఆ నీటితోనే తమ గ్రామానికి సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు.
అయితే ఇటీవల చెరువు పైభాగం నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మిస్తున్నారని, అయితే వరద నీరు చెరువులోనికి వచ్చే విధంగా కల్వర్టు నిర్మించడం లేదని ఆరోపించారు. ఈ వర్షాకాలంలో వరద నీరు చెరువులోకి రాకుండా అడ్డుగా రోడ్డు ఉండడంతో తమకు వరద నీటికి ఇబ్బందిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాణ పనులు నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థ ప్రతినిధి శ్రీరామ్ అక్కడికి చేరుకొని కల్వర్టు నిర్మిస్తామని, ఒకటి రెండు రోజుల్లో పనులు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.