calender_icon.png 25 June, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు వేదిక వద్ద రైతుల నిరసన

25-06-2025 12:38:34 AM

మహబూబాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ధరణిలో తమ సాగు భూములను అడవిగా నమోదు చేయడంతో రైతుబంధు, రైతు భరోసా పథకాలకు దూరమవుతున్నామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యకు పరిష్కారం చూపి, సాగు చేసుకుంటున్న భూములను రికార్డుల్లో నమోదు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వేదిక వద్ద నారాయణపురం గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ రవి మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామంలో ఉన్న తమ గ్రామాన్ని కేసముద్రం మండలానికి మార్చారని, ఆ తర్వాత భూ ప్రక్షాళన సమయంలో తమ గ్రామ రైతులు సాగు చేసుకుంటున్న భూములను రెవిన్యూ అధికారులు అడవిగా పేర్కొనడం వల్ల అప్పటివరకు ఉన్న పట్టా పాస్ పుస్తకాలు, పహాని రికార్డులు వినియోగించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా సాగులో ఉన్న భూములకు పట్టా పాస్ పుస్తకాలు అందజేసి రైతు భరోసా, రైతు బీమా కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.