13-09-2025 02:31:36 AM
ఘట్ కేసర్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి ఘట్ కేసర్ మండల రైతులు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి.
శుక్రవారం రిలే నిరాహార దీక్షలో ఎదులాబాద్ రైతులు కూర్చున్నారు. రిలే నిరాహార దీక్షలో కూర్చున్న రైతులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ సంఘీభావం తెలియజేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఘట్ కేసర్ రైతు సేవ సహకార సంఘంలో సభ్యులైన రైతులకు రైతు రుణమాఫీ పథకం రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసే వరకు తమ దీక్ష కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రైతులు జై జవాన్, జై కిసాన్, రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా రైతు సొసైటీ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, బి. స్రవంతి, బిజెపి రాష్ట్ర నాయకులు కాలేరు రామోజీ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మిడి శోభారాణి, మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బస్వ రాజుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ బొక్క సురేందర్ రెడ్డి, నాయకులు గడీల సంజీవరెడ్డి, వేముల మహేశ్వర్ గౌడ్ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.