23-06-2025 01:03:18 AM
- ఆరు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.7,770.83కోట్లు
- ఏడేళ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయం అందించటంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల ను జమ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభు త్వం ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేసింది.
ఈసారి జూన్ 16వ తేదీన రైతునేస్తం వేదికగా సీఎం రేవంత్రెడ్డి రైతుభరోసా చెల్లింపులను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి ఆరు రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతులకు రూ.7,770.83 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. శనివారం నాటికే రాష్ట్రంలోని 9 ఎకరాల్లోపు భూములున్న రైతులందరికీ ప్రభుత్వం నిధులు జమ చేసింది.
గడిచిన ఏడేళ్లలో ఇంత వేగంతో రైతులు ఖాతాల్లో నిధులు జమ కావడం ఇదే మొదటిసారి. వ్యవసాయశాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో రూ.7,360 కోట్లు జమ చేయగా, ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం 6 రోజుల్లోనే రూ.7,770.83 కోట్లు పంపిణీ చేసింది. తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9వేల కోట్లు పంపిణీని విజయవంతంగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖలు కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నాయి.