21-06-2025 01:15:02 AM
మాటల తూటాలు..!
వరంగల్/హనుమకొండ, జూన్ 20 (విజయక్రాంతి): వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చురేగుతున్నది. మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్రావు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు -కొండా మురళిపై తిరుగుబాటు ప్రకటించినట్లు స్పష్ట మవుతోంది. అంతేకాకుండా పార్టీ నేత లు సైతం కొండా వ్యాఖ్యలపై గరం అవుతున్నారు.
ఈ మేరకు శుక్రవారం వరం గల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కొండా మురళి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చ రిస్తూనే అధిష్ఠానానికి సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పార్టీ అధిష్ఠానం కూడా కొండా మురళి వ్యాఖ్యలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.
ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండా వ్యాఖ్యలపై ప్రతిస్పందించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు బహిర్గతమయ్యాయని ప్రచారం సాగుతోంది.
అధిష్ఠానం చూస్తూ ఊరుకోదు: ఎమ్మెల్యే నాయిని
శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఇంట్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నాగరాజు, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి సమావేశమయ్యారు. కొండా తీరుపై సమావేశంలో చర్చించారు.
మురళిపై అధిష్ఠానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడారు. నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే పార్టీ అధిష్ఠానం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన తర్వాత బీసీ కార్డు అడ్డుపెట్టుకుంటారా? బీసీ అయితే చేసిన పాపాలు అన్నీ పోతాయా అని ప్రశ్నించారు.
పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని, సీనియర్ నాయకులు అనే ఇంగితం లేకుండా ఏది పడితే అది మాట్లాడటం తగదని పరోక్షంగా కొండా మురళికి రాజేందర్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వరంగల్లో పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం జరిగే విధంగా వ్యాఖ్యలు, చర్యలు ఉంటున్నాయని కొండా దంపతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ పాపాన్ని తాము మోయలేమని, వారిని పార్టీ నుంచి పంపించేయాలని కొండా దంపతులను ఉద్దేశించి అధిష్ఠానికి విజ్ఞప్తి చేశారు.
కొండా వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆరా
సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. పీసీసీ కొండా తీరుపై ఆరా తీస్తున్నట్లు వరంగల్ కాంగ్రెస్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గురువారం పోచమ్మ మైదానం వద్ద జరిగిన రాహుల్గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా అసలు ఏం జరిగిందనే విషయంపై కూడా ఆరా తీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
కొండా మురళి ఏమన్నారు?
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పోచమ్మ మైదానం వద్ద గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కొండా మురళి మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకొన్న కనుబొమ్మలు లేని నాయకుడొకరు చంద్రబాబును, కేసీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడని, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పరకాల నుంచి గెలిచిన మరో వ్యక్తి 75 ఏళ్ల దరిద్రుడని, ఎన్నికలకు ముందు తన వద్దకు వచ్చి కాళ్లు పట్టుకుంటే ఎమ్మెల్యేగా గెలిపించానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తమ కూతరు కొండ సుష్మిత పటేల్ పోటీ చేస్తుందని ప్రకటించారు. కొంతమంది నాయకులు తనకు పోలీసులు ఎస్కార్ట్ కల్పిస్తే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.
రాహుల్గాంధీ, రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం కొండా సురేఖా మంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదని మురళి స్పష్టం చేశారు. అంతేకాకుండా సురేఖకు మూడు శాఖలు ఉన్నట్లే కానీ ఒక్కపైసా రాదని, తానే నెలకు రూ.5 లక్షలు పంపుతున్నానని తెలిపారు. గత కొంతకాలంగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు కొండా మురళి వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయనే చర్చ సాగుతోంది.